అదృష్టం తెచ్చే "భోగి" ... ఎవరికి ?
అదృష్టం తెచ్చే "భోగి".
ఎవరికి ? ఎలా ?
చెన్నై, ఆంగ్ల జనవరి 11, 2025 : ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా నిత్యం జరుగుతోన్న దివ్య-కైంకర్యంలో, ఆధ్యాత్మికవేత్త ప్రాచీన సంకీర్తన ప్రచారకర్త శ్రీరామపాద భాగవతర్ సంక్రాంతి పండుగ సందర్భంగా శ్రీమహాలక్ష్మి కటాక్షం కోరుకునేవారికి ముఖ్య సూచన తెలియజేసారు.
భోగి రోజున బ్రహ్మ ముహూర్త కాలంలో (తె.4 గం.) నిద్ర లేచి మంచుగా - చలిగా ఉన్న వేళ ఇంటిల్లిపాది ఆనందంగా చేయవలసిన విధిని క్లుప్తంగా వివరించారు. “ఇంటిలో నిర్జీవంగా (పనికిరాకుండా, ఉపయోగంలేని) పడియున్న వస్తువులు, దుస్తులు, సామానులను ఆ రోజున తెల్లవారేలోపే విసర్జించాలి (బయట పడేయాలి). ఎందుకంటే అవి ఇంటి శ్రేయస్సు, అభివృద్ధికి ఆటంకాలు. పిదప (సూర్యోదయానికి ముందే) స్నానమాచరించి ప్రత్యక్ష నారాయణునకు (సూర్య భగవానుడు) నమస్కరించి, సంప్రదాయబద్ధంగా కులదైవాన్ని, గ్రామదేవతని స్మరించి ఆ రోజు రాత్రి శయన హారతి లోపు దర్శించాలి. అంతకు ముందురోజుకే గృహమంతా ఇంట - బయట పరిసరాలు శుభ్రం చేసుకుని ఉంటాము కాబట్టి, ఇలా చేయడం వలన ప్రతికూల తరంగాలు (నెగటివ్ వైబ్రేషన్ అంటే అలక్ష్మి) నిష్క్రమిస్తాయి. అప్పుడు మాత్రమే ఇంటిలోనికి శ్రీమహాలక్ష్మి ప్రవేశిస్తుంది. అనుకూల తరంగాలు (పాజిటివ్ వైబ్రేషన్) గృహములో సర్వత్రా వ్యాపించి ఇల్లంతా సుఖసంతోషాలతో వర్ధిల్లుతుంది” అని శ్రీరామపాద అన్నారు.
ఆ విషయానికి వస్తే, ఈ ప్రక్రియ నిరంతరము కొనసాగాలని, ఎక్కడైనా పరమాత్మ
శక్తి, కృప కలగాలంటే శుచి, శుభ్రత, భక్తి, నామస్మరణ అవసరమని, అలక్ష్మి వెళ్ళిపోతే గాని
లక్ష్మి అనుగ్రహము కలుగదని శ్రీరామపాద భాగవతర్ తెలియజేసారు. ఇంట లక్ష్మి అనుగ్రహం ఆశించేవారు
పగిలిన - విరిగిన ఏ వస్తువుని ఉపయోగించరాదని, ఆగిపోయిన గడియారాలు, పగిలిన అద్దములు
– ఫొటోలు, చిరిగిపోయిన వస్త్రాలు, వగైరా తక్షణమే విసర్జించాలని ఆయన సూచించారు. శివైక్యం
చెందిన వారి చిత్రపటాలు పూజగదిలో పెట్టకూడదని చెప్పారు.
ఇంటి ముందు ఆవు పిడకల (జలము) తో కళ్ళాపు జల్లి, బియ్యపు పిండితో (మాత్రమే. ఎందుకంటే క్రిమి, కీటకాలు, చీమలు, సూక్ష్మరూపులైన భూత ప్రేత పిశాచాలకు రసాయనాలు హానికరం. వాటి ఆహారాన్ని విషపూరితం చేయడం పాపభూయిష్టం అవుతుంది. దోష పరిహార నిమిత్తం చేసే మంగళకరమైన పనిని మనమే చెడు చేసుకోకూడదు కదా!) ముగ్గులు వేయడం, గుమ్మాలకు పసుపు పూసి తోరణాలు కట్టడం, తులసి మొక్కకు పూజచేసి ప్రదక్షిణలు చేయడం ముఖ్యమని, ఎక్కడ "తులసి" ఉంటుందో అక్కడ లక్ష్మినారాయణుడు నివాసం ఉంటాడనేది సర్వత్రా విదితమేనని శ్రీరామపాద అన్నారు. పూజగది ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండే విధంగా చూసుకోవాలని, ధూపమును గృహమంతా చూపాలని, అవకాశం ఉన్నప్పుడల్లా, ఏ పనిచేస్తున్నా, అటుఇటు నడుస్తున్నపుడు, ఉదయం వ్యాయామ సమయంలో, గృహంలోనూ, ఆఫీస్లోనూ, ఖాళీగా ఉన్నప్పుడు తోచిన భగవన్నామ స్మరణ చేస్తూ ఉండాలని ఆయన అన్నారు. తద్వారా అన్నివేళలా అక్కడ అనుకూల తరంగాలు (పాజిటివ్ వైబ్రేషన్) ఏర్పడుతాయని, ఇది చదువుకునే పిల్లలకు, ఉద్యోగ-వ్యాపారం చేసేవారికి, పెద్దల ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరమని శ్రీరామపాద భాగవతర్ చెప్పారు. అలాగే విధిగా, అవకాశం దొరికినప్పుడల్లా గో పూజ, గోశాల ప్రదక్షిణం, గోసేవ చేయాలని, వేద శ్రవణం, వేద పాఠశాల - విద్యార్థుల పోషణ, వేదోత్తములకు కించిత్ సేవ, చేయూత పలు దోషముల నివృత్తికి దోహదం చేస్తుందని, అత్యంత ముఖ్యముగా మనకు అందుబాటులో ఉన్న రైతులను అభినందించడం, నమస్కరించడం, గౌరవంతో సత్కరించడం, సహాయం అందించడం, (ఎద్దులు పోషణ నిమిత్తం) ఆర్థికముగా తోడ్పడటం చేయాలి. అప్పుడే "అన్న దాత సుఖీభవ" అన్న వేద వాక్కునకు అర్థం చేకూర్చినవారవుడమే కాకుండా, జగన్మాత అన్నపూర్ణ పరమేశ్వరి కృప కలిగి అన్నానికి లోటు లేకుండా బ్రతుకగలుగుతాం. మరొక ప్రక్క, అర్హులైన పురుషులు సంక్రమణ తర్పణ విధులు నిర్వహించడం ఉత్తమం. ఇవన్నీ యుగ-యుగాలుగా ఆచరించబడుతోన్న సనాతన ధర్మ సంప్రదాయమని చెప్పారు.
ఇంటిలో సంప్రదాయ విధులను విస్మరించి గుడికి వెళ్ళినా, బయట పెద్దవారిని కలిసి పాదాలు మ్రొక్కినా ఫలితం ఉండదు.
ధనుర్మాస ఉత్సవాలు ఎంతో వైభవంగా
జరుగుతున్నాయని, చివరి రోజు గోదాకళ్యాణంతో పరిసమాప్తి అవుతుందని, ఈ నెలరోజులు దేశ
- విదేశాలలో ధనుర్మాస వ్రతాన్ని, పూజలను, తిరుప్పావై – తిరువెంబావై - శ్రీహరి
నామస్మరణతో గడిపిన ప్రతిఒక్కరు, పాలుపంచుకున్న- వీక్షించిన - శ్రవణం చేసిన అందరికి
శ్రీరంగనాథుని పరిపూర్ణ కరుణ - కటాక్షములు కలగాలని శ్రీరామపాద భాగవతర్
ప్రార్థించారు.
ఈ సందర్భంగా భక్తులు, మితృలు,
భగవత్ - బంధువులు అందరికి మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసారు.
⯁ శ్రీరామపాద భాగవతర్
https://www.facebook.com/Sriramapada.Bhagavathar/
https://www.youtube.com/@Sriramapada.Bhagavathar
facebook.com/Sriramapada
Note :
Rights reserved. Copy, alteration, reproduction is prohibited.
Sharing as it is permitted.



